ఎంపీపీపై దాడి.. వ్యక్తిపై కేసు నమోదు

19 Aug, 2019 07:47 IST|Sakshi
గాయపడిన ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి,  బంట్వారం/ రంగారెడ్డి : వారిద్దరు ఒకే గ్రామానికి చెందిన మంచి మిత్రులు. కానీ మద్యం మత్తు వారిద్దరి మధ్య చిచ్చుపెట్టింది. బీరు బాటిల్‌తో దాడి చేయడంతో కోట్‌పల్లి ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శనివారం రాత్రి కోట్‌పల్లి పెట్రోల్‌ పంపు ఎదురుగా జరిగింది. ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. కోట్‌పల్లి మండల పరిధిలోని రాంపూర్‌ గ్రామానికి చెందిన నల్లోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, చేపూరి శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరూ స్నేహితులు. ఈ క్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆయన స్నేహితుడు జగన్‌రెడ్డిలు కలిసి చేపూరి శ్రీనివాస్‌రెడ్డి ఫర్టిలైజర్‌ షాపులో మద్యం సేవిస్తున్నారు. కొద్దిసేపటికి ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, చేపూరి శ్రీనివాస్‌రెడ్డిల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో క్షణికావేశంతో చేపూరి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డిపై బీరు బాటిల్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎంపీపీ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న  రాంపూర్‌ మాజీ ఎంపీటీసీ ప్రతాప్‌రెడ్డి, జగన్‌రెడ్డిలు వెంటనే తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఎంపీపీని తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఎంపీపీ భార్య లలిత ఫిర్యాదు మేరకు చేపూరి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు. 

జెడ్పీ చైర్‌పర్సన్‌ పరామర్శ 
విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునితారెడ్డి ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న కోట్‌పల్లి  ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించారు.  గాయపడిన ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి  

మరిన్ని వార్తలు