స్నేహితురాలిని బైక్‌ ఎక్కించుకోలేదని..

14 Nov, 2017 08:50 IST|Sakshi

యువకుడిపై దాడి

కుత్బుల్లాపూర్‌: తన గర్ల్‌ఫ్రెండ్‌ను బైక్‌పై తీసుకువెళ్లలేదన్న కోపంతో ఓ విద్యార్థి స్నేహితులతో కలిసి కారులో ఓ యువకుడిని కిడ్నాప్‌ చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ అందె శ్రీనివాస్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మైసమ్మగూడలోని కళాశాలలో ఎంబీఏ చదువుతున్న విద్యార్ధిని,   జగద్గిరిగుట్టకు చెందిన తన క్లాస్‌మేట్‌ పవన్‌కుమార్‌ను ఈ నెల 6న బైక్‌పై ఎర్రగడ్డకు తీసుకువెళ్లాలని కోరింది.

అందుకు పవన్‌కుమార్‌ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సదరు యువతి ఈ విషయాన్ని అదే కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్న జోయల్‌కు చెప్పింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న జోయల్‌ తన స్నేహితులు  ప్రేమ్‌కుమార్, రీయాజ్‌లతో కలిసి 7వ తేదీన పవన్‌కుమార్‌ను కారులో తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి  షాపూర్‌నగర్‌లో దింపి వెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం నిందితులు జోయల్, ప్రేమ్‌కుమార్, పవన్‌కుమార్‌లను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.

మరిన్ని వార్తలు