భార్యా పిల్లలను చంపి ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య

19 Dec, 2018 10:16 IST|Sakshi
విమల, బాబు, దియ (ఫైల్‌)

చెన్నై, టీ.నగర్‌: చెన్నై తురైపాక్కం కన్నగినగర్‌లో భార్య, ఇద్దరు పిల్లలను హత్యచేసి ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం సాయింత్రం చోటుచేసుకుంది. తురైపాక్కానికి చెందిన ఆటోడ్రైవర్‌ బాబు (30). ఇతని భార్య విమల (27)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కుమారుడు కిషోర్‌ (6),  కుమార్తె దియా (4) సంతానం. బాబుకు మద్యం అలవాటు ఉండేది. ప్రతిరోజు మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడు. గత 14వ తేదీన మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు.

దీంతో ఆగ్రహించిన భార్య విమల పిల్లలతో తిరుకళుకుండ్రంలోని పుట్టింటికి వెళ్లింది. దీంతో బాబు 16వ తేదీ అత్తారింటికి వెళ్లి భార్య పిల్లలను తీసుకువచ్చాడు. ఇదిలాఉండగా సోమవారం సాయంత్రం బాబు ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాలేదు. దీంతో అనుమానించిన ఇరుగుపొరుగువారు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా విమల, పిల్లలు మృతిచెంది కనిపించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం తెలపడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విమల ఉరేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించింది. పిల్లల గొంతు నులిమి హతమార్చినట్లు తెలిసింది. లోనికి వెళ్లి చూడగా బాబు ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెంది శవంగా వేలాడుతున్నాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు