సాక్షి, అనకాపల్లిటౌన్(విశాఖపట్టణం) : పాత కక్షల కారణంగా స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయానికి ఆనుకుని ఉన్న రామునాయుడుకాలనీలో బుధవారం అర్ధరాత్రి ఓ ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. పంచదార్ల మురళీ అలియాస్ దొడ్డి మురళీ(23)ని అదే ప్రాంతానికి చెందిన రవి, గణేష్లు మారణాయుధాలతో తలపై కొట్టారు. రక్తపు మడుగులో ఉన్న మురళీని పోలీసుల సాయంతో స్థానికులు పక్కనే గల ఎన్టీఆర్ వైద్యాలయంలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గతంలో మురళీ అదే ప్రాంతంలో నివాసముండేవాడు. ఇతనికి వివాహం కాలేదు. ముగ్గురు అన్నదమ్ములు. వారిలో ఆఖరివాడు మురళీ. ఇద్దరు అన్నయ్యలకు వివాహాలు జరిగాయి. ఇతనికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.ఇటీవల కొత్తూరు నర్సింగరావు పేటకు మకాం మార్చాడు. వివాహం కాకపోవడంతో తల్లి సన్యాసమ్మతో కలిసి జీవిస్తున్నాడు. చోడవరం వంటి ప్రాంతాలకు ఆటోలో పండ్లను సరఫరా చేస్తుంటాడు.
రామునాయుడుకాలనీ పక్కనే ఉన్న పండ్ల మార్కెట్లో బుధవారం రాత్రి పండ్లను లోడింగ్ చేస్తుండగా విషయం తెలుసుకున్న రవి, గణేష్లు అతనిపై మారణాయుధాలతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న మురళీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ తాతారావు రంగప్రవేశం చేసి ఎన్టీఆర్ వైద్యాలయంలో చేర్పించారు. గణేష్, రవి.. మురళీల మధ్య పాతకక్షలు ఉన్నాయి. మృతునిపై పట్టణ పోలీస్స్టేషన్లో తొమ్మిది కేసులు ఉన్నాయి. నిందితులు రవి, గణేష్లపై కూడా నాలుగు కేసులున్నాయి.డీఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.