రూ. 80 కోసం కత్తితో పొడిచి చంపారు..

9 Oct, 2018 12:15 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. రూ. 80 కోసం వాదన జరగడంతో ప్రయాణీకులు ఆటోడ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపిన ఘటన ఢిల్లీలోని జనసమ్మర్ధ కన్నాట్‌ ప్లేస్‌లో జరిగింది. నిందితులు నలుగురినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరణించిన ఆటో డ్రైవర్‌ను జామియా నగర్‌కు చెందిన జహంగీర్‌ అలాంగా గుర్తించారు. నిందితులందరూ తొమ్మిది, పదో తరగతి విద్యార్దులు కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

ఆదివారం రాత్రి నలుగురు నిందితులు దక్షిణపురిలో ఆటో మాట్లాడుకుని మూల్‌చంద్‌లో పరాటాలు తినేందుకు వెళ్లారు. అయితే అక్కడా పరాటాలు లేకపోవగడంతో కన్నాట్‌ ప్లేస్‌కు వెళ్లాలని రూ. 120 ఇస్తామని చెప్పారు. ఆటో కస్తూర్బా గాంధీ మార్గ్‌ బస్‌స్టాప్‌ వద్దకు రాగానే అర్ధరాత్రి కావడంతో ఒక్కొక్కరికి రూ. 20 చొప్పున అదనంగా ఇవ్వాలని ఆటో డ్రైవర్‌ కోరడంతో వాగ్వివాదం జరిగింది.

నిందితుల్లో ఒకరు జహంగీర్‌ ఆలంపై కత్తితో దాడి చేశాడు. బాధితుడు కేకలు వేయడంతో స్ధానికులు రాగా ఒక నిందితుడు పట్టుబడగా, మిగిలిన వారు పరారయ్యారు. గాయపడిన ఆలంను పోలీసులు రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు చెప్పారు. ఆలంపై కత్తితో దాడి చేసిన నిందితుడిని స్ధానికులు పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారని తెలిపారు. ​కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఢిల్లీ డీసీపీ మాధుర్‌ వర్మ తెలిపారు.

మరిన్ని వార్తలు