ఆటో బోల్తా : ఒకరి మృతి

5 May, 2018 08:36 IST|Sakshi
బోల్తాపడిన ఆటో ఇదే (ఇన్‌సెట్‌) భిక్షం మృతదేహం

టేకులపల్లి : ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో ఒకరు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్‌ కుమార్‌ తెలిపిన వివరాలు...సింగరేణి ఆధ్వర్యంలో రెండు నెలల క్రితం, కేఓసీ ప్రభావిత ప్రాంతాల వారికి ఉచితంగా కంటి పరీక్షలు జరిగాయి. ఆ రోజు పరీక్షలు చేయించుకున్న వారికి కోయగూడెం గ్రామంలో శుక్రవారం ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వనున్నట్టు సింగరేణి అధికారులు ప్రకటించారు. దీంతో, అద్దాలు తీసుకునేందుకు కోయగూడెం పంచాయతీ కొండంగులబోడుకు చెందిన మిడతపల్లి భిక్షం(60), కేళోత్‌ దూడి, జర్పుల సామ్యా కలిసి ఆటోలో కోయగూడెం బయల్దేరారు. కోయగూడెం–మద్రాస్‌ తండా మధ్యలో ఆ ఆటో అదుపుతప్పి, రోడ్డు పక్కనున్న లోయలో బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో మిడతపల్లి భిక్షం (65) అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న సర్పంచ్‌ పూనెం సురేందర్‌ స్పందించి, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. ఏఎస్‌ఐ అజీజ్‌ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కేసును ఎస్‌ఐ దర్యాప్తు చేస్తున్నారు. భిక్షానికి భార్య సైదమ్మ ఉన్నారు. పిల్లలు లేరు.

మరిన్ని వార్తలు