ఓవర్‌లోడ్‌.. అతివేగం.. అజాగ్రత్త

24 Apr, 2018 10:43 IST|Sakshi
బోల్తాపడిన ఆటో

 ఉపాధి కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా  

21మందికి గాయాలు  

పనులు ముగించుకుని వస్తుండగా ఘటన  

సారంగాపూర్‌(జగిత్యాల): పరిమితికి మించిన ప్రయాణాలతో ప్రాణాలు పోతున్నా.. ప్రయివేటు వాహనదారులకు పట్టింపు ఉండడం లేదు. ఓ వైపు రహదారి భద్రతవారోత్సవాలు ప్రారంభించి ప్రమాదకర ప్రయాణాలపై అవగాహన కల్పిస్తున్నా.. ఓవర్‌లోడ్‌ ప్రయాణాలు తగ్గడం లేదు. కరీంనగర్‌ జిల్లాలో ఆటోబోల్తాపడి 8 మంది మరణించిన ఘటన మరువకముందే జగిత్యాల జిల్లాలో సోమవారం మరో ఘటన జరిగింది. 35మంది ఉపాధిహామీ కూలీలతో వెళ్తున్న ట్రాలీఆటో బోల్తాపడింది. ఆటోలోని 21మంది గాయపడగా.. ఆదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. వీరందరినీ జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం..  
సారంగాపూర్‌ మండలం పెంబట్ల గ్రామంలోని బుడిగెజంగాలకాలనీ, బీసీ కాలనీకి చెందిన కూలీలు కొద్దిరోజులుగా ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారు. సోమవారం ఉదయం పెంబట్ల గ్రామ శివారుల్లోని పెంబట్ల– రంగపేటమధ్య పెద్దమ్మ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాం తంలో పనులు నిర్వహించడానికి సుమారు 35 మంది గ్రామానికి చెందిన పార్తం గంగాధర్‌ ట్రాలీఆటోలో వెళ్లారు. పనులు ముగించుకుని 10 గంటల ప్రాంతంలో ఆటోలో ఇళ్లకు బయల్దేరారు. ఆటో లక్ష్మీదేవిపల్లి గ్రామం దాగటగానే ఓవర్‌లోడ్‌తో కుదుపునకు గురికావడంతో డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌వేశాడు. దీంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 21 మంది కూలీలు గాయపడ్డారు.  

క్షతగాత్రులు వీరే..
ఆటోలో ప్రయాణిస్తున్న కుంట గంగు, పురా ణం మల్లవ్వ, పత్రి రాధ, గిండె లక్ష్మి, పర్సమల్ల బుజ్జి, పత్రి లచ్చవ్వ, పత్రి భీమక్క, మిర్యాల సుమలత, పత్రి కావ్య, మస్తాను దుబ్బరాజు, అనుమండ్ల సునీత, పురాణం మమత, పత్రి చిన్నఎల్లవ్వ, చొప్పరి సుజాత, బొడ్డుపల్లి మల్లవ్వ, సొప్పరి రాజమ్మ, కట్టెకోల దుబ్బరాజు, నారెల్ల ఆశవ్వ, పత్రి భీమక్క, పస్తం గంగమ్మ, మామిడి లక్ష్మి గాయపడ్డారు. పత్తి ఎల్లవ్వ, పురాణం ఎల్లక్క, పత్రి లచ్చవ్వ, పత్రి భీమక్క, పస్తం దుబ్బరాజుకు తీవ్రగాయాలయ్యాయి.

సకాలంలో స్పందించిన పోలీసులు
విషయం తెలుసుకున్న సారంగాపూర్‌ ఎస్సై రాజయ్య అక్కడికి చేరుకున్నారు. 108 రావడం ఆలస్యం కావడంతో ప్రయివేటు వాహనాల్లో క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించా రు. తహసీల్దార్‌ వసంత, ఎంపీడీవో పుల్లయ్య పరిస్థితి సమీక్షించారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తదితరులు పరామర్శించారు. ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు