-

ఆమెపై అత్యాచారం చేసి.. ఉరి బిగించారు

7 Nov, 2019 11:39 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన హిందూ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. గొంతు నులమడం వల్లే ఊపిరాడక ఆమె చనిపోయినట్లు గురువారం పేర్కొంది. అత్యాచారం జరిగిన కాసేపటి తర్వాతే బాధితురాలు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కాగా సింధ్‌ ప్రావిన్స్‌లోని లర్ఖానా జిల్లాలోని బీబీ ఆసిఫా డెంటల్‌ కాలేజీ విద్యార్థిని చాందిని(పేరు మార్చాం) సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ 16న తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. అయితే తన సోదరి ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదని.. కచ్చితంగా ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారంటూ ఆమె సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఈ నేపథ్యంలో ఘటనాస్థలిలో దొరికిన ఆధారాలు, బాధితురాలి దుస్తులపై ఉన్న రక్తపు మరకలను వైద్యులు విశ్లేషించిన క్రమంలో ఆమె హత్య గావించబడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఈ కేసుకు సంబంధించి 32 మందితో పాటు మృతురాలి కాల్‌డేటా ఆధారంగా  తోటి విద్యార్థులైన మెహ్రాన్ అబ్రో, అలీ షాన్ మెమన్లను అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్నారు. కేసు విషయమై కాలేజీలో విచారించగా బాధితురాలు తన హాస్టల్‌ గదిలోనే సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. అయితే అటాప్సీ నివేదికలో ఆమెపై అత్యాచారం జరిగిందని తేలడంతో ఈ కేసు క్లిష్టతరంగా మారింది. ఈ క్రమంలో ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా సింధ్‌ ప్రభుత్వం ఆదేశించింది. 
(చదవండి : షాకింగ్‌ : యువతి మృతదేహంలో యువకుడి డీఎన్‌ఏ)

మరిన్ని వార్తలు