ఇంక ఎవరిని న‍మ్మాలి!

19 Jul, 2018 08:53 IST|Sakshi

మానవ మృగాలు.. దాదాపు పాతిక మంది. 11 ఏళ్ల దివ్యాంగురాలైన బాలికపై బాలికపై దాష్టీకానికి పాల్పడిన ఘటన దేశం మొత్తాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఏడు నెలలుగా తమ ముందే నవ్వుతూ తిరుగుతున్న కామ పిశాచాలు.. ఆ చిన్నారిని చిదిమేశారన్న ఘోర వాస్తవాన్ని అపార్ట్‌మెంట్‌వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ భయం వారిని ఇప్పట్లో వీడిపోయేలా లేదు..

సాక్షి, చెన్నై: మొత్తం ఎనిమిది బ్లాకులు. ప్రతీ బ్లాక్‌ ఎంట్రెన్స్‌ వద్ద ఒక్కో మహిళ.. చేతిలో కర్రతో కనిపిస్తున్న దృశ్యం. అలాగని వాళ్లు సెక్యూరిటీ గార్డులు కాదు. ఎవరినీ నమ్మలేని స్థితిలోని ఉన్న అపార్ట్‌మెంట్‌  మహిళలంతా కూడగలుపుకుని.. ఇలా రోజుకు కొందరు గార్డు విధులను నిర్వహిస్తున్నారు. కొత్తగా ఎవరైనా కనిపించినా.. చివరికి పనివాళ్లనైనా సరే... క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతిస్తున్నారు.. వారి కదలికలపై నిఘా వేస్తున్నారు. అయనావరంలోని సన్నీవేల్ అపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి ఇది.  (డ్రగ్స్‌ ప్యాకెట్లు.. కండోమ్‌లు)

ఎవరిని నమ్మాలి...? ‘నిత్యం నవ్వుతూ, సెల్యూట్‌ చేస్తూ అమ్మ అని పిలిచే అతనిలో.. అంతటి రాక్షసుడు ఉన్నాడన్న విషయం నాకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మాకు ఏదో ఒకనాడు ముప్పు ఉండేదేమో!. కళ్ల ముందు ఇంత ఘోరం జరిగాక ఇంకా భయం పెరిగిపోయింది. ఇంతకాలం బయటి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందేమోనని భయపడేవాళ్లం. కానీ, అదే ప్రమాదంతో ఉన్నామన్నది ఇప్పుడు తేటతెల్లమైంది’ అని ఓ గృహిణి చెబుతోంది. ‘అపార్ట్‌మెంట్‌లో సీసీ ఫుటేజీలు సరిగ్గా పని చేయటం లేదు. ఇప్పుడు వాటిని రిపేర్‌ చేయించాం. మరికొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయించాం. 24/7 వాటిని పర్యవేక్షించేందుకు సిబ్బందిని కూడా నియమించుకున్నాం. ఒంటరిగా ఉన్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని, స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌లకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అందరికీ మేం సూచిస్తున్నాం’ అని ఓ యువతి వ్యాఖ్యానించింది. దాదాపు పాతిక మంది (వృద్ధులు, మధ్య వయస్కులు) కలిసి ఏడు నెలలపాటు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వారిని వణికించింది. అందుకే ఎవరినీ నమ్మలేకపోతున్నారు.  (ఎంత ఘోరం)

సీడబ్ల్యూసీకి చిన్నారి... అయనవరం రేప్‌ కేసులో  కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. బాలికను సీడబ్ల్యూసీకి తరలించకపోవటంపై ఆగ్రహం వెల్లగక్కింది. తక్షణమే సీడబ్ల్యూ ముందు ఆమెను హాజరుపరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. మానసిక నిపుణులతో కౌన్సిలింగ్‌ ఇప్పించిన తర్వాత చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. ఇక సైకాలజిస్టులు మాత్రం తల్లిదండ్రుల తీరును తప్పుబడుతున్నారు. ‘బాలికతో వారి బంధం సరిగ్గా ఉంటే.. వాళ్లు ఆమె కోసం కనీసం సమయం కేటాయించి ఉంటే ఈ ఘోర కలికి ఎప్పుడో అడ్డుకట్ట పడి ఉండేది. ఆమెలో ప్రవర్తననైనా వాళ్లు గమనించాల్సి ఉండేది. ఇది ముమ్మాటికీ వాళ్ల తప్పు కూడా’ అని సీనియర్‌ సైకాలజిస్టు ఒకరు చెబుతున్నారు. 

విస్తూపోయే రీతిలో...  66 ఏళ్ల లిఫ్ట్‌ ఆపరేటర్‌తోపాటు మరో 25 మంది విస్తూపోయే రీతిలో అతికిరాతకంగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అపార్ట్‌మెంట్‌లో సీసీ ఫుటేజీలు సర్వేలెన్స్‌ లేని ప్రదేశాలకు తీసుకెళ్లి.. డ్రగ్స్‌ ఇచ్చి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై వీడియోలు తీసి చంపేస్తామని బెదిరించి ఏడు నెలలుగా దాష్టీకానికి పాల్పడుతూ వస్తున్నారు. లిఫ్ట్‌ ఆపరేటర్‌తోపాటు ఫ్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మరికొందరు యువకులు ఈ రాక్షస క్రీడలో నిందితులు.  వీరిలో 18 మంది నిందితులను కటకటాల వెనక్కునెట్టారు. మరో 6 మంది కోసం గాలిస్తున్నారు. నిందితులను న్యాయవాదులు కోర్టులో చితకబాదటం తెలిసిందే.

మరిన్ని వార్తలు