మోదీకి మొరపెట్టుకున్న నటి భర్త

4 Jul, 2018 11:36 IST|Sakshi

ముంబై: ప్రముఖ నటి ఆయేషా టకియా భర్త ఫర్హాన్‌ అజ్మీ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో సోషల్‌ మీడియా ద్వారా తన బాధను ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు మొరపెట్టుకున్నారు. తన భార్య, తల్లి, సోదరీమణులను ఓ వ్యక్తి వేధిస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫర్హాన్‌ మంగళవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమకు సహాయం చేయాలని జోన్‌ 9 డీసీపీ దహియాకు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా, మెసేజ్‌ పెట్టినా స్పందించలేదని తెలిపారు. అక్రమంగా తమ బ్యాంకు ఖాతాలను నిలిపివేశారన్నారు. ప్రధాని మోదీ, సుష్మా స్వరాజ్‌ జోక్యం చేసుకుని తమను కాపాడాలని ఆయన అభ్యర్థించారు.

చివరకు పోలీసులు స్పందించడంతో ధన్యవాదాలు తెలిపారు. జాయింట్‌ కమిషనర్‌(శాంతిభద్రతలు) దేవెన్‌ భారతి స్పందించడంతో ముంబై పోలీసులపై నమ్మకం కలిగిందని మరో ట్వీట్‌ చేశారు. కాగా, ఫర్హాన్‌ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్న వ్యక్తి అతడి వ్యాపార మాజీ భాగస్వామి కషిఫ్‌ ఖాన్‌ అని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ వెల్లడించింది. తనను మోసం చేశాడని కషిఫ్‌ ఖాన్‌పై బాంద్రా పోలీసు స్టేషన్‌లో ఫర్మాన్‌ కేసు పెట్టారు. హిందూ మతానికి ఆయేషా టకియాను పెళ్లి చేసుకున్నందుకు గతంలో ఫర్హాన్‌ అజ్మీకి గతంలో బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి.

మరిన్ని వార్తలు