మిద్దెపై నుంచి పడి చిన్నారి దుర్మరణం

26 Dec, 2017 08:55 IST|Sakshi
చిన్నారి ఐశ్వర్య ఫైల్‌

అందరూ క్రిస్మస్‌ను సంతోషంగా జరుపుకున్నారు. క్రీస్తు గురించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. అనూహ్యంగా జరిగిన ప్రమాదంలో చిన్నారి మృతిచెందింది. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ ఇంటిలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఒక్కగానొక్క కూతురు మిద్దెపై నుంచి జారి పడి దుర్మరణం చెందడంతో ఆ దంపతులు చేస్తున్న చేస్తున్న రోదనలు అన్నీ ఇన్నీ కావు. ఈ సంఘటన రేణిగుంట మండలంలో సోమవారం సాయంత్రం జరిగింది.

చిత్తూరు, రేణిగుంట:మిద్దెపై నుంచి పడి చిన్నారి మృతిచెందిన సంఘటన రేణిగుంటలో జరిగింది. మండలంలోని ఎల్లమండ్యంకు చెందిన మదన్‌మోహన్‌ ఎలక్ట్రికల్‌ పనులు చేసుకుంటూ భార్య కళ, కుమార్తె ఐశ్వర్య (3)ను పోషించుకుంటున్నాడు. రేణిగుంట మంచినీళ్ల గుంత వద్ద ఉన్న తన సమీప బంధువు ఇంటిలో సోమవారం జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాడు. అందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాయంత్రం అందరూ ఇంటి పనుల్లో ఉండగా ఐశ్యర్య మూడవ అంతస్తు మిద్దిపైకి ఎక్కింది.

ఆటలాడుకుంటూ అక్కడి నుంచి కాలుజారి కింద పడింది. తీవ్రంగా గాయపడిన బాలికను తిరుపతి రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. స్విమ్స్‌లో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. కళ్లముందే కన్నబిడ్డ విగతజీవిగా మారడంతో నిండు గర్భిణిగా ఉన్న కళను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. చిన్నారి మృతితో రేణిగుంట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామం ఎల్లమండ్యకు తీసుకెళ్లడంతో గ్రామం శోకసంద్రంగా మారింది. ఈ దుర్ఘటనపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు