అమ్మాయిల పేరుతో మోసగిస్తున్న ఇద్దరి అరెస్టు

10 Dec, 2018 13:24 IST|Sakshi
పోలీసులు అరెస్టు చేసిన నిందితులు

ఆటోనగర్‌ (విజయవాడ తూర్పు) : ‘మావద్ద అమ్మాయిలు ఉన్నారు... మీకు కావాలంటే ఈ ఫోన్‌ నెంబర్లలో సంప్రదించండి..’ అంటూ కొంత మందిని చీట్‌ చేసిన బెంగళూరుకు చెందిన రక్షిత్‌ (24), మంజు (32) అనే ఇద్దరు యువకులను పటమట పోలీసులు శనివారం రాత్రి బెంగళూరులో పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన రక్షిత్, మంజు మొదట ‘మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు.. కావాలా...’ అంటూ కొన్ని నెంబర్లకు ఫోన్‌ చేస్తారు. అలాగే, ఇందుకుగాను ప్రత్యేకంగా ఇంటర్నెట్‌లో ఓ సైట్‌ను కూడా నిర్వహిస్తున్నారు.

వాటి ద్వారా కాంటాక్ట్‌లోకి వచ్చిన వారికి ఫలానా అడ్రస్‌లో అమ్మాయి ఉంటుంది. కావాలంటే కొంత మొత్తం చెల్లించాలి అని నమ్మిస్తారు. వారి వద్ద నుంచి తమ అకౌంట్‌లోకి సొమ్మును బదిలీ చేయించుకుంటారు. ఆ తర్వాత అమ్మాయి ఉన్న అడ్రస్‌ ఇస్తారు. అయితే, సొమ్ము చెల్లించిన వారు ఆ అడ్రస్‌కు వెళ్తే అక్కడ ఎవరూ ఉండరు. సంబంధిత వ్యక్తులకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వస్తుంది. ఇలా సొమ్ము చెల్లించి మోసపోయిన న్యూ ఆర్టీసీ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్టోబరు 24 న పటమట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీస్‌లు వివిధ కోణాల్లో, పలు ప్రాంతాల్లో నిందితుల కోసం గాలించారు. చివరకు శనివారం రాత్రి 7 గంటలకు బెంగళూరులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని ఇక్కడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధించినట్టు సీఐ కె.ఉమామహేశ్వరరావు తెలిపారు.  

మరిన్ని వార్తలు