పెళ్లైన తొమ్మిది నెలలకే..

6 Jul, 2019 09:33 IST|Sakshi
మృతిచెందిన శివకుమార్‌

సాక్షి, నెల్లిమర్ల(విజయనగరం) : రోడ్డు ప్రమాదంలో బ్యాంక్‌ ఉద్యోగి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరంలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన శివకుమార్‌ జరజాపుపేట ఏపీజీవీ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్ల కిందట ఇక్కడికి బదిలీపై వచ్చారు.  తొమ్మిది నెలల కిందటే ఆయనకు వివాహమైంది. తల్లిదండ్రులు, భార్యతో కలిసి కొత్తపేటలోనే నివశిస్తున్న ఆయన ప్రతిరోజూ జరజాపుపేటలోని బ్యాంకుకు ద్విచక్ర వాహనంపై వస్తుండేవాడు.

ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 9 గంటలకు బ్యాంకుకు వెలుతున్నానని చెప్పి ఇంటివద్ద బయలుదేరారు. సరిగ్గా నెల్లిమర్లలోని సీకేఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్దకు వచ్చేసరికి వెనకనుంచి మితిమీరిన వేగంతో వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. శివకుమార్‌ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఎస్సై అశోక్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు