బ్యాంకు ఉద్యోగిని బలిగొన్న బైక్‌ రైడింగ్‌!

13 Aug, 2018 17:25 IST|Sakshi

గురుగ్రామ్‌ : బైక్‌ రైడింగ్‌ సరదా ఓ బ్యాంకు ఉద్యోగి ప్రాణాలు బలిగొంది. స్నేహితులతో కలిసి లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లిన అతడు అతి వేగం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కుండ్లీ-మనేసర్‌- సల్వాల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ ఢిల్లీకి చెందిన సంచిత్‌ ఒబెరాయ్‌(25) ఓ మల్టీనేషనల్‌ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. బైక్‌ రైడింగ్‌ అంటే సరదా ఉన్న సంచిత్‌.. ఇటీవలే సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌ను కొనుగోలు చేశాడు. స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం లాంగ్‌డ్రైవ్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో స్నేహితులంతా పోటాపోటీగా బైక్‌లు నడుపుతూ వేగంగా వెళ్తున్న సమయంలో.. సంచిత్‌ వేగాన్ని పెంచాడు. దీంతో తన ముందు ప్రయాణిస్తున్న లారీని ఢీ​కొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంచిత్‌ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

అతి వేగం కారణంగానే..
ప్రమాదం జరిగిన సమయంలో సంచిత్‌ బైక్‌ 200 కిలో మీటర్ల స్పీడుతో ప్రయాణిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. సంచిత్‌ స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు