తాళికట్టు వేళ.. వరుడికి చెరసాల

9 Dec, 2019 03:40 IST|Sakshi
మోహన్‌కృష్ణను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్న పోలీసులు

నిశ్చితార్థం ఒకరితో చేసుకుని మరొక యువతిని పెళ్లాడటానికి యత్నం  

ఓ బ్యాంకు మేనేజర్‌ నిర్వాకం 

బొమ్మలసత్రం: ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని మరో యువతి మెడలో తాళికట్టేందుకు సిద్ధమైన ఓ వంచకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరుపతికి చెందిన మోహన్‌కృష్ణ ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకోవడానికి ఆగస్టు 24న నిశ్చితార్థం చేసుకున్నాడు. కట్నకానుకల కింద రూ.12 లక్షల నగదు, 6 తులాల బంగారాన్ని తీసుకున్నాడు. అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. జాతకాలు కుదరలేదని దాన్ని రద్దు చేసుకున్నట్టు మోహన్‌కృష్ణ సోదరుడు వీరప్రసాద్‌ పెళ్లికుమార్తె కుటుంబానికి సమాచారమిచ్చాడు. కట్నాన్ని కూడా తిరిగి ఇవ్వలేదు.

నంద్యాల మహానందీశ్వర దేవస్థానంలో ఆదివారం మరో యువతికి తాళికట్టడానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసు కున్న పోలీసులు పెళ్లిపీటలపై కూర్చున్న మోహన్‌కృష్ణతోపాటు అతడి సోదరుడు వీరప్రసాద్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం వివాహం చేసుకోబోతున్న యువతి కుటుంబసభ్యుల వద్ద కూడా రూ.15 లక్షల నగదు, 12 తులాల బంగారం కట్నంగా మాట్లాడుకుని.. ఇప్పటికే రూ.12 లక్షల నగదు, 6 తులాల బంగారం తీసుకున్నట్లు ఆ యువతి తల్లిదండ్రులు తెలిపారు. మోహన్‌కృష్ణ, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరప్రసాద్‌ గతంలో నంద్యాలలోని కెనరా బ్యాంకులో ఉద్యోగిగా పనిచేశాడు. ఆ సమయం(2008)లో  నిరుద్యోగులను మోసం చేశాడు. రూ.400 చెల్లిస్తే నెలకు రూ.30 వేలు సంపాదించే సలహాలిస్తానని నమ్మించి 300మంది నిరుద్యోగులనుంచి రూ.400 చొప్పున వసూలు చేశాడు. దీనిపై చీటింగ్‌ కేసు నమోదైంది. 
 

మరిన్ని వార్తలు