బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య

14 Jul, 2018 08:17 IST|Sakshi
అచ్చు ఆర్‌.చంద్రన్, (ఇన్‌సెట్‌) ఉరేసుకున్న అచ్చు ఆర్‌.చంద్రన్‌

అన్నానగర్‌: నాగర్‌కోవిల్‌లో శుక్రవారం బ్యాంక్‌ మేనేజర్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. తిరువనందపురం వెల్లమ్‌పలం ప్రాంతానికి చెందిన చంద్రన్‌ కుమారుడు అచ్చు ఆర్‌.చంద్రన్‌ (28) అవివాహితుడు. ఇతను నాగర్‌కోవిల్‌లోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నాగర్‌కోవిల్‌లోని దేవసహాయం వీధిలో ఉన్న ఇంట్లో ఉంటున్నాడు. రోజు ఉదయం 9 గంటలకు ఆఫీస్‌కి వెళతాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటలైనా బ్యాంకుకు వెళ్లలేదు. దీంతో సహ సిబ్బంది అచ్చు ఆర్‌.చంద్రన్‌కి ఫోన్‌ చేసినా తీయలేదు.

అనంతరం బ్యాంకు ఉద్యోగి ఇతన్ని వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు. చాలాసేపు తలుపులు తట్టినా తెరవలేదు. తలుపులు గట్టిగా తోసినప్పుడు తెరచుకున్నాయి. లోపలికి వెళ్లి చూడగా అచ్చు ఆర్‌.చంద్రన్‌ ఫ్యాన్‌కి ఉరేసుకుని శవంగా వేలాడుతున్నాడు. సమాచారం అందుకున్న వడచేరి పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. చంద్రన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆచారిపల్లం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు