యువతి బలవన్మరణం

25 Feb, 2020 11:19 IST|Sakshi
హిమబిందు (ఫైల్‌)

మలక్‌పేట: సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఓ బ్యూటీషియన్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మేళ్లచేర్వు మండలం మల్లారెడ్ది గూడెం గ్రామానికి చెందిన డేవిడ్‌రాజ్‌ ఎలక్ట్రిషియన్‌ కుమార్తె పి.హిమబిందు (22)  బ్యూటీషియన్‌ కోర్సు శిక్షణ కోసం మూడేళ్ల క్రితం నగరానికి వచ్చింది. ఆస్మాన్‌గఢ్‌ వెంకటాద్రినగర్‌ ధాత్రి నిలయంలో ఉంటున్న స్వాతితో ఆమెకు పరిచయమైంది.

అప్పటి నుంచి బ్యూటిషియన్‌ హెల్పర్‌గా స్వాతి వద్ద పని చేస్తూ ఆమె కుటుంబంతో ఉంటోంది.  ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో స్వాతి సోదరుడు సాయికిషోర్‌ పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసి హిమబిందు తన బెడ్‌రూమ్‌లో ఉరేసుకుందని, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిదని సమాచారం అందించాడు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఎస్సై బాలరాజ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయి కిషోర్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుండగా... ప్రేమ వ్యవహారమే హిమబిందు ఆత్మహత్యకు కారణమై ఉంటుదని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు