‘నాకిదే చివరిరోజు.. బాబుని నువ్వే చూసుకో’

26 Feb, 2018 14:39 IST|Sakshi
మృతురాలు రష్మీ (పాత ఫొటో)

బెంగళూరు : వరకట్నం వేధింపులకు మరో యువతి బలైపోయింది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న రష్మీ (28) ఆదివారం రాత్రి తన ఫ్లాట్‌లో బలవన్మరణానికి పాల్పడింది. చనిపోవడానికి ముందు.. అమెరికాలో ఉంటున్న తన సోదరికి ‘నాకిదే చివరిరోజు, బాబును చూసుకో’ అని మెసేజ్‌ చేసింది. బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాలివి..

కెంపెగౌడా రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే రష్మీ.. ఆదివారం అర్ధరాత్రి తర్వాత అమెరికాలో ఉన్న తన సోదరికి మెసేజ్‌ చేసింది. ఇదే తన చివరి రోజని, బాబును జాగ్రత్తగా చూసుకోవాలన్నది మెసేజ్‌ సారాంశం. దీంతో కంగారుపడ్డ సోదరి.. బెంగళూరులోనే నివాసం ఉంటున్న తల్లి భాగ్యమ్మకు విషయాన్ని చెప్పి, తక్షణమే రష్మీ ఫ్లాట్‌కు వెళ్లాలని సూచించింది. ఎంతసేపు తట్టినా తలుపు రష్మీ తీయకపోవడంతో ఆమె తల్లి.. సతీష్‌(రష్మీ భర్త)కు ఫోన్‌ చేసింది. అతను ఊళ్లో లేకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించింది. తలుపులు పగులగొట్టి చూడగా, సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న రష్మీ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

వేధింపుల పరంపర : కోలార్‌ జిల్లాకు చెందిన సతీష్‌, బెంగళూరుకు చెందిన రష్మీలకు మూడేళ్ల కిందట వివాహమైంది. ఈ ఇద్దరూ స్థానిక మాన్యతా టెక్‌ పార్కులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేసేవారు. కాగా, అదనపు కట్నం తేవాలంటూ రష్మీని సతీష్‌ వేధించేవాడు. శారీరక, మానసిక హింసకు గురిచేసేవాడు. భర్త వేధింపులు తాళలేని స్థితిలో రష్మీ రెండు వారాల కిందటే ఉద్యోగానికి రాజీనామా చేసింది. 16 నెలల వయసున్న కొడుకును తల్లి భాగ్యమ్మకు అప్పగించింది. ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకునేముందు సోదరికి మెసేజ్‌లు పంపింది. ఫిర్యాదుబమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సతీష్‌ ను, అతని తల్లి గాయత్రిని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.

రష్మీ, ఆమె భర్త సతీష్‌ (ఫైల్‌ ఫొటో)

 

మరిన్ని వార్తలు