మరదలితో వివాహేతర సంబంధం.. 

30 Mar, 2018 09:26 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

మృతుడు ప్రైవేట్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

భీమారం : గ్రేటర్‌ వరంగల్‌ నగర పరిధిలోని 55వ డివిజన్‌ భీమారంలో విషాదం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో బుధవార అర్ధరాత్రి బావ, మరదలు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మరదలిని హత్య చేసి, బావ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం జిలుగులకు చెందిన తిరుపతిరెడ్డి–అరుణ దంపతులకు కూతుళ్లు ప్రతిభారెడ్డి, రక్షణారెడ్డితోపాటు మరో కుమారుడు ఉన్నారు.    కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం రాయకల్‌కు చెందిన రావుల రవీందర్‌రెడ్డి–రాజేశ్వరీ దంపతుల కుమారుడు ప్రవీణ్‌రెడ్డి(30)తో ప్రతిభారెడ్డికి మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. వారికి రెండేళ్ల కూతురు ఉంది. నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి భీమారంలో నివాసముంటున్నాడు. 
మరదలితో వివాహేతర సంబంధం.. 
ప్రతిభారెడ్డి సోదరి రక్షణారెడ్డి(23) చదువు నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ప్రవేశం పొందింది. మూడేళ్లుగా అక్క ఇంట్లోనే ఉంటూ కళాశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో తన బావతో  ఏర్పడిన సాన్నిహిత్యమే వివాహేతర సంబంధానికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. అయితే విషయం బయటికి పొక్కడంతో కుటుంబంలో గొడవలు జరిగాయి. దీంతో ఇరుకుటుంబాల పెద్దలు ఇద్దరిని మందలిం చినట్లు తెలిసింది. దీంతో రక్షణారెడ్డిని  తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు.15 రోజులుగా రక్షణారెడ్డి ఇంటి నుంచి కాలేజీకి రాకపోకలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఉగాది పండుగకు ప్రతిభారెడ్డి తన తల్లిగారింటికి వెళ్లగా, ప్రవీణ్‌రెడ్డి ప్రస్తుతం హుజు రాబాద్‌లో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచే కళాశాలకు వెళ్తున్నాడు. 
భీమారం ఇంట్లో ఆత్మహత్య.. 
ఉదయం కళాశాలకని బయల్దేరిన రక్షణారెడ్డి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. ఫోన్‌ కూడా కలవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రవీణ్‌రెడ్డికి ఫోన్‌ చేసినా నోరెస్పాన్స్‌ వచ్చింది. దీంతో అర్ధరాత్రి ప్రతిభారెడ్డి తన తండ్రి తిరుపతిరెడ్డి, సోదరుడితో కలిసి భీమారానికి బయల్దేరింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో కింది పోర్షన్‌లో వారిని నిద్ర లేపి తాళం చెవి ఇచ్చారా అని అడిగింది. వారు లేదనడంతో ఎలాగు రాత్రికి అక్కడే ఉండాలని భావించి రాయితో తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రక్షణారెడ్డి మంచంపై విగతజీవురాలై కనిపించింది. పక్కనే సీలింగ్‌ ఫ్యాన్‌ పడి ఉంది. ప్రవీణ్‌రెడ్డి బెడ్‌రూమ్‌ వెనక తలుపు తెరిచి అదే బెడ్‌ పక్కన పడి మృతి చెందాడు. 
ఘటనపై పోలీసుల దర్యాప్తు 
సీఐ సతీష్‌బాబు, ఎస్సై భీమేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు అక్కడే విధులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న హన్మకొండ ఏసీపీ రాజేంద్రప్రసాద్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఐదు రోజుల క్రితమే సూసైడ్‌ నోట్‌
ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ప్రవీణ్‌రెడ్డి ఐదురోజుల క్రితమే సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టుకున్నాడు. ఈ నోట్‌ పోలీసులకు చిక్కింది. తన భార్య మంచిదని అందులో పేర్కొన్నాడు. అత్తమామలు కూడా తనకు తల్లిదండ్రిలాంటి వారని రాశాడు. తన కూతురిని సాకే బాధ్యత తండ్రి తీసుకోవాలని పేర్కొన్నాడు.

చెల్లిని చంపి.. 
ఆత్మహత్య చేసుకున్నాడు
తన చెల్లిని చంపి, ప్రవీణ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య ప్రతిభారెడ్డి రోదిస్తూ తెలిపింది.  బతికి ఉంటే ఎక్కడ చంపుతారనే భయంతో నిద్రమాత్రలు మింగాడని పేర్కొంది.

మృతుడి భార్య ప్రతిభారెడ్డి

మరిన్ని వార్తలు