వేధింపులను అడ్డుకున్నందుకు బిహార్‌లో దారుణం

28 Aug, 2019 16:44 IST|Sakshi

పట్నా: బిహార్‌లోని దౌద్‌పూర్‌ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యురాలిని వేధిస్తున్న పోకిరీలను ఆపేందుకు ప్రయత్నించడంతో ఆ కుటంబంలోని 16 మందిపై యాసిడ్‌ దాడి చేశారు. వివరాలు.. దౌద్‌పూర్‌ గ్రామానికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన కొందరు పోకిరీలు గత కొద్ది రోజులుగా వేధిస్తున్నారు. దీని గురించి సదరు యువతి కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో కొద్ది రోజుల క్రితం పోకిరీలకు, యువతి కుటుంబ సభ్యులకు మధ్య పెద్ద గొడవ జరగింది. గ్రామస్తులు కల్పించుకోవడంతో ఆ వివాదం సద్దుమణిగింది. కానీ మరుసటి రోజే దాదాపు 20 మంది యువకులు సదరు యువతి ఇంట్లోకి ప్రవేశించి.. ఆమె కుటుంబ సభ్యుల మీద యాసిడ్‌ దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో 16 మంది ఉన్నారు. వారందరి మీద యాసిడ్‌ పోశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరిని బిహార్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు