బిహార్‌లో దారుణం..

10 Jan, 2019 20:58 IST|Sakshi

పట్నా : బిహార్‌లో పదహారేళ్ల బాలిక దారుణ హత్యకు గురయ్యింది. దాంతో గయా పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. వివరాలు.. గత ఆదివారం గయలో శరీరం నుంచి తలను వేరు చేయడమే కాకుండా ముఖంపై యాసిడ్‌తో కాల్చిన గాయాలు, ఛాతీపైనా తీవ్రమైన గాయాలతో అత్యంత దారుణ స్థితిలో ఓ పదాహారేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. మరణించిన బాలిక డిసెంబరు 28న కనిపించకుండా పోగా, జనవరి 6న కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. తమ కూతురుపై అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ సంఘటన పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసుల దర్యాప్తు త్వరగా చేయాలని, దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ గయలో మంగళ, బుధ వారాల్లో క్యాండిల్‌ లైట్లతో ర్యాలీలు చేశారు.

అయితే ఈ కేసు విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లిదండ్రులు దీన్ని అత్యాచారం, హత్యగా ఆరోపిస్తుండగా.. పోలీసులు మాత్రం పరువు హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం లభ్యమై అయిదు రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్ట్‌ చెయ్యకపోవడంపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు.  తమ కూతురు  కనిపించట్లేదని ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే బాలిక కుటుంబ సభ్యుల చెప్పిన విషయాలు వేర్వేరుగా ఉన్నాయంటున్నారు పోలీసులు. పోస్ట్‌మార్టంలో బాలికపై అత్యాచారం జరిగిందా.. లేదా అని తెలుస్తుందని.. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని తెలిపారు పోలీసులు.

మరిన్ని వార్తలు