సాక్షి, న్యూఢిల్లీ : మెడలో బంగారు గొలుసులతో ఆడవాళ్లు కనిపిస్తే.. చైన్ స్నాచింగ్లతో రెచ్చిపోయే కేటుగాళ్ల ఆగడాలకు చెక్ చెప్పే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తన మెడలో గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించిన యువకుడికి కూతురుతో కలిసి తగిన శాస్తి చేసిందో మహిళ. ఆగస్టు 30న ఢిల్లీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
తల్లీ కూతుళ్లు పక్కన నిలుచొని ఉండగా, బైక్పై వచ్చిన దుండగుల్లో ఒకడు మహిళ మెడలోని చెయిన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతే శరవేగంగా స్పందించిన ఆమె (తల్లి) బైక్పై వెనక కూర్చుని ఉన్న అతగాణ్ని గుంజి నాలుగు తగిలించింది. దీనికి యువతి (కూతురు) కూడా తోడయ్యింది. ఇంతలో చుట్టుపక్కల వారు కూడా జత కూడడంతో అతగాడి ఆట కట్టింది. ఈ దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డయ్యాయి. మరోవైపు బైక్పై వున్న మరో యువకుడు పారిపోవడం కూడా కెమెరా కంటికి చిక్కింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.