కల్వర్టును ఢీకొన్న బైక్‌..వ్యక్తి మృతి

2 Mar, 2018 12:18 IST|Sakshi
ప్రమాదంలో మృతిచెందిన వెంకటప్ప(35)

కరన్‌కోట్‌: తాండూరు మండల పరిధిలోని కరన్‌కోట్‌ గ్రామంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు  గ్రామస్తుల కథనం ప్రకారం..మండల పరిధిలోని బెల్కటూర్‌ గ్రామానికి చెందిన చాకలి వెంకటప్ప(35) కరన్‌కోట్‌లోని సీసీఐ సిమెంటు కర్మాగారంలో గత 13 సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కరన్‌కోట్‌లోని సీసీఐ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి స్వగ్రామంలో జరిగిన బంధువుల విందుకు హాజరై తిరిగి బైక్‌పై కరన్‌కోట్‌కు బయలుదేరాడు.

ఈ క్రమంలో కరన్‌కోట్‌ శివారులోని సీసీఐకి వెళ్లే దారి మలుపులో స్పీడ్‌ బ్రేకర్‌ పక్కన ఉన్న కల్వర్టును అతివేగంతో ఢీకొన్నాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని స్థానికులు గమనించి సీసీఐ అంబులెన్స్‌లో తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే వెంకటప్ప మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. గురువారం పోస్టుమార్టం అనతరం మృతదేహాన్ని స్వగ్రామనికి తరలించారు. కాగా మద్యం మత్తుతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణంగా గ్రామస్తులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కార్మిక సంఘం నాయకుడు శరణప్ప డిమాండ్‌ చేశారు.    

మరిన్ని వార్తలు