ఎన్నికల వేళ బీజేపీ నేత దారుణ హత్య

4 Nov, 2018 12:17 IST|Sakshi

జైపూర్‌ : ఎన్నికల వేళ రాజస్థాన్‌లో కలకలం రేగింది. బీజేపీకి చెందిన ఓ నాయకున్ని కొందరు దుండగులు అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ ఘటన ప్రతాప్‌ఘర్‌ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. భారతీయ జనతా పార్టీకి చెందిన సామ్రాట్‌ కుమావత్‌ ప్రయాణ నిమిత్తం రోడ్డు పక్కన నిల్చుని ఉన్నారు. ఈ క్రమంలో బైకుల వచ్చిన నలుగురు దుండగులు కుమావత్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అనంతరం కత్తులతో అతనిపై దాడి చేశారు. 

మెడపై కత్తి వేట్లు పడడంతో తీవ్ర రక్తస్రావంతో కుమావత్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని స్థానికులు వెల్లడించారు. చుట్టుపక్కలవారు స్పందించి హంతకుల్ని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వారు అక్కడినుంచి ఉడాయించారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ  ఘటనపై బీజేపీ వర్గాలు భగ్గుమన్నాయి. కుమావత్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై ధర్నా చేశారు. నిందితులని త్వరలోనే పట్టుకుని త్వరలోనే అరెస్టు చేస్తామని ప్రతాప్‌ఘర్‌ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ బాబూలాల్‌ హామీనివ్వడంతో ధర్నా విరమించారు.మరో నెల రోజుల్లో ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్‌లో ఈ హత్యోదంతం రాజకీయ వేడి రాజేసింది.

మరిన్ని వార్తలు