లిఫ్ట్‌లో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతదేహం

27 May, 2020 18:56 IST|Sakshi

ముంబై : ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినల్‌కు దగ్గరలోని సెంట్‌ జార్జీ ఆసుపత్రిలో కరోనా విధులు నిర్వహిస్తున్న 45 ఏళ్ల నర్సు శవం ఆసుపత్రి లిఫ్ట్‌లో అనుమానాస్పద స్థితిలో లభించింది. కాగా మహిళ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది స్వాధీనం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి మెడికల్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ ఆకాశ్‌ కిబ్రాగడే తెలిపిన వివరాలు ప్రకారం.. చనిపోయిన 45 ఏళ్ల మహిళ గత ఆరేళ్లుగా ముంబైలోని సెంట్‌ జార్జీ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. తాజాగా కరోనా నేపథ్యంలో ఆమెకు కోవిడ్‌​-19 స్పెషల్‌ డ్యూటీ వేశారు. కాగా గత కొన్ని రోజులుగా అన్ని రకాల షిఫ్ట్‌ల్లో అందుబాటులో ఉంటున్న ఈమె చనిపోవడానికి ముందు సెకెండ్‌ ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కింది. ఆ తరువాత చూస్తే ఆమె శవంగా కనిపించిందని పేర్కొన్నారు.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారమందించామని, మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించినట్లు తెలిపారు. అయితే సదరు మహిళ బహుశా లిఫ్ట్‌ ఎక్కేటప్పుడు లేక దిగేటప్పుడు ఆమె తల డోర్‌లో చిక్కుకుపోవడంతో బలమైన దెబ్బ తగలడంతోనే మృతి చెందినట్లు పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు. అయినప్పటికి పోస్టుమార్టం తర్వాతే ఆమె మృతికి గల కారణాలు బయటపడతాయని పేర్కొన్నారు. అంతవరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 
రోడ్డు ప్రమాదంలో కన్నడ నటి మృతి

మరిన్ని వార్తలు