పర్హీన్‌ ప్రభాకర్‌పై దోపిడీ ముఠా దాడి

21 Jan, 2019 10:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ భార్య, బాలీవుడ్‌ నటి పర్హీన్‌ ప్రభాకర్‌పై దేశ రాజధానిలో దోపిడీ దొంగల ముఠా దాడికి పాల్పడింది. థక్‌ థక్‌ గ్యాంగ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ఈ దాడికి తెగబడినట్టు పోలీసులు పేర్కొన్నారు. పర్హీన్‌ దక్షిణ ఢిల్లీలోని ఓ షాపింగ్‌ మాల్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని సర్వప్రియ విహార్‌లో ఉండే పర్హీన్‌ తన కారులో సెలెక్ట్‌ సిటీ వాక్‌ మాల్‌కు వెళుతుండగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద దోపిడీ ముఠా అడ్డగించిందని పోలీసులు చెప్పారు.

ఆమె తన కారును పార్క్‌ చేసి వారితో మాట్లాడుతుండగా దాడికి దిగి ఆమె వద్దనున్న రూ 16,000 నగదు, డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు, మొబైల్‌ ఫోన్లను బలవంతంగా లాక్కుని రోడ్డుకు ఎదురుగా పార్క్‌ చేసిన వారి కారులో పరారయ్యారు. దోపిడీ ముఠా దాడికి గురైన పర్హీన్‌ రోడ్డుపై కుప్పకూలారు. ఓ ఆర్మీ అధికారి ఆమెకు సాయం అందించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల వాహన రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను పోలీసులకు అందచేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తిస్తామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని దక్షిణ ఢిల్లీ డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు