అక్కంపల్లెలో పేలుడు

26 Feb, 2020 12:39 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు

కూలీకి తీవ్ర గాయాలు

నాటుబాంబు పేలినట్లు అనుమానం

కర్నూలు, సంజామల: మండలంలోని అక్కంపల్లెలోమంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తికి చెందిన నరేష్‌రెడ్డి అనే కూలీ గాయపడ్డాడు. పాత ఇల్లు తీసేసే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. అక్కంపల్లెకు చెందిన చెంచిరెడ్డి తన పాత ఇంటిని తీసేసి, నూతన గృహాన్ని కట్టుకోవాలనుకున్నాడు. మంగళవారం ఉదయం నలుగురు కూలీలతో పాత ఇంటిని తొలగిస్తుండగా.. గోడకు ఉన్న గూటిలో ఏదో వస్తువు కనిపించింది. దాన్ని కూలీ నరేష్‌రెడ్డి చేత్తో పట్టుకుని పక్కన పడేశాడు.  పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నరేష్‌రెడ్డి చేతికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే చికిత్స నిమి త్తం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగుకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు, సంజామల ఎస్‌ఐ ప్రియతంరెడ్డి పే లుడు జరిగిన ఇంటిని పరిశీలించారు. నాటుబాంబు పేలి ఉండొచ్చనే అనుమానంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు