అనుమానం పెనుభూతమై..

7 Mar, 2019 11:00 IST|Sakshi
బాత్‌రూంలో ఫాతిమా మృతదేహం నిందితుడు అహ్మద్‌ (ఫైల్‌)

భార్యను హత్య చేసిన బౌన్సర్‌

చాంద్రాయణగుట్ట: అనుమానంతో ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి భార్యను గొంతుకోసి హత్య చేసిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ జి.కోటేశ్వర్‌రావు కథనం ప్రకారం.. బార్కాస్‌ సలాలా ప్రాంతానికి చెందిన ఫాతిమా బిన్‌ అలీ సాది(22), ఇదే ప్రాంతానికి చెందిన అహ్మద్‌ బిన్‌ సాలం అలియాస్‌ అహ్మద్‌ బా సులేమాన్‌(26)ల వివాహం గతేడాది ఫిబ్రవరిలో జరిగింది. కాగా వెంటనే పిల్లలు వద్దని ఫాతిమా.. తనకు పిల్లలు కావాలని అహ్మద్‌ వాదించుకునేవారు. ఈ విషయంలో ఇద్దరూ గొడవ పడుతున్నారు. మాదాపూర్, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో పబ్బులో బౌన్సర్‌గా పనిచేసే అహ్మద్‌.. పగలు ఇంట్లో ఉంటూ భార్య ఫోన్‌ పరిశీలిస్తూ.. ఎవరితో చాటింగ్‌ చేస్తున్నావంటూ అనుమానంతో ప్రశ్నించేవాడు.

రోజు రోజుకు అనుమానాన్ని తలకెక్కించుకొని వేధించేవాడు. ఇవి భరించలేని ఫాతిమా నాలుగు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. గతనెల ఫిబ్రవరి 4న మొదటి వివాహ వార్షికోత్సవం ఉండడంతో అంతకు రెండు రోజుల ముందు ఫాతిమా పుట్టింటికి వచ్చిన అహ్మద్‌.. భార్యను బాగా చూసుకుంటానని వెంట తీసుకొచ్చాడు. కాగా ఈనెల 5న రాత్రి అహ్మద్‌ తల్లి బయటికి వెళ్లగా.. మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ రేగింది. అహ్మద్‌ కోపంతో ఆమెను కొట్టగా భయపడిన ఫాతిమా బాత్‌రూంలో దాక్కుంది. అయినా వదలని భర్త ఆమె గొంతుకోసి విచక్షణా రహితంగా పొడిచి చంపేసి పరారయ్యాడు. రాత్రి 11 గంటలకు చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందగా వారు మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.

ఘటనా స్థలానికి పోలీస్‌ ఉన్నతాధికారులు...  
గృహిణి దారుణ హత్య విషయం తెలుసుకున్న నగర జాయింట్‌ సీపీ (ఎస్‌బీ) తరుణ్‌ జోషి, ఫలక్‌నుమా, మీర్‌చౌక్‌ ఏసీపీలు డాక్టర్‌ ఎంఏ.రషీద్, ఆనంద్, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ జి.కోటేశ్వర్‌ రావు, ఎస్సై ఎ.శివతేజ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన తీరును పరిశీలించిన అధికారులు ఘటనా స్థలంలో లభ్యమైన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు