బెంగళూరు: గేమ్స్ ఆడుకుంటానంటే ఓ తండ్రి తన 15 ఏళ్ల కొడుకుకు తన మొబైల్ ఫోన్ ఇచ్చాడు. కొడుకు గేమ్స్ ఆడుతూ.. అనుకోకుండా ఫోన్ రికార్డర్ ఓపెన్ చేశాడు. అందులో తండ్రి, ప్రియురాలితో సాగించిన ప్రేమ సంభాషణలు ఉన్నాయి. ఇక, వాట్సాప్ ఓపెన్ చేస్తే.. వారిద్దరి మధ్య సాగిన రాసలీలలు దర్శనమిచ్చాయి. దీంతో బిత్తరపోయిన ఆ 15 ఏళ్ల పిల్లాడు వెంటనే ఫోన్ తల్లికి చేతికి అందించాడు. ఆయన గారి బాగోతం చూసి.. షాక్ తిన్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్తకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
బెంగళూరులోని బనశంకరీ స్టేజ్-3 ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ.. సాయంకాలాలు ట్యూషన్ చెప్పే ఓ గృహిణి పోలీసులను ఆశ్రయించారు. భర్త వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించడంతో అతడు తనపై దాడి చేశాడని, తనను కొట్టి బెదిరించాడని ఆమె పోలీసులకు తెలిపారు. ఆమె భర్తను ఎం నాగరాజుగా గుర్తించారు. ఓ సామాజిక సంస్థ నాయకుడిగా కొనసాగుతున్న ఆయన ఇటీవల తన ఫోన్ను గేమ్స్ ఆడేందుకు కొడుకుకు ఇచ్చాడు. కొడుకు ఫోన్లో ఉన్న తండ్రి రాసలీలలు గుర్తించడం.. వాటిని తన తల్లి దృష్టికి తీసుకురావడంతో.. ఈ విషయమై నాగరాజును ఆమె ప్రశ్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజు.. తన బాగోతాన్ని బయటపెడితే.. తీవ్ర పరిణామాలుంటాయని భార్యను హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించిన ఆమెను ఫిర్యాదు వెనుకకు తీసుకోవాల్సిందిగా నాగరాజు కుటుంబసభ్యులు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.