మిస్టరీగా బాలుడు, బాలిక అదృశ్యం

3 Jul, 2019 06:46 IST|Sakshi
సొండి తమన్,, కొట్నాల భవాని

సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : మండల కేంద్రం కొత్తూరుకు చెందిన అరేళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక అదృశ్యం మిస్టరీగా మారింది. ఈ కేసును పోలీసులు సవాల్‌ తీసుకున్నారు. కొత్తూరుకు చెందిన కొట్నాల భవాని(బాలిక) చిన్నప్పుడే అమ్మను కోల్పోవడంతో తండ్రి మరో వివాహం చేసుకోని వేరే గ్రామం వెళ్లిపోయాడు. అదే గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ దగ్గర భవాని ఉంటుంది. జూన్‌ 26న పాలకొండలో తన స్నేహితురాలి వివాహం ఉందని చెప్పి సొండి తమన్‌ను (వరసకు మామయ్య కుమారుడు) తనతోపాటు తీసుకుని వెళ్లింది. తిరిగి ఇంటికి చేరకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో బాలుడి తల్లిదండ్రులు వెతికారు. ఇద్దరి ఆచూకీ తెలియకపోవడంతో స్థానిక పోలీసులకు సోమవారం బాలుడి తండ్రి చిరంజీవి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్‌ఐ బాలకృష్ణ కేసు నమోదు చేశారు. పాలకొండ డీఎస్పీ ప్రేమ్‌ కాజిల్, ఇన్‌చార్జి సీఐ రవిప్రసాద్‌ మంగళవారం ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేశారు. 

బాలుడు తల్లిదండ్రులు, బాలిక అమ్మమ్మను, భవానీ స్నేహుతురాలను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. భవాని తీసుకువెల్లిన ఫోన్‌ సిగ్నల్స్‌ హైదరబాద్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో కొత్తూరు నుంచి రెండు బృందాలు మంగళవారం బయలుదేరి వెళ్లాయి. తమన్‌ తల్లిదండ్రుల మధ్య వివాదం కారణంగా తల్లి కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. పక్క వీధిలో ఉన్న భవాని ఇంటి వద్దకు తమన్‌ నిత్యం వస్తుంటాడు. బాలుడిని తీసుకుపోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. భవాని బంధువు కావడంతో నమ్మి పంపిస్తే ఇలా జరిగిందని తల్లడిల్లుతున్నారు. బాలుడుని భవాని తీసుకువెళ్లడానికి కారణాలు తెలియకపోవడంతో ప్రాణాలతో రావాలని కోరుకుంటున్నారు. ఫోన్‌ చేస్తుంటే కట్‌ చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మిస్టరీ స్థానికంగా సంచలనం రేపింది. బాలుడు తమన్‌ కొత్తూరులోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. భవాని కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8 తరగతి చదువుతుంది. 

మరిన్ని వార్తలు