మరికొద్ది గంటల్లో బర్త్‌డే వేడుకలు.. అంతలోనే

24 Jan, 2020 11:22 IST|Sakshi

గుహవాటి : మరికొద్ది గంటల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న ఘటన గుహవాటిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుహావటికి చెందిన తుషార్‌ శివసాగర్‌లో జియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. కాగా తన భార్య శిల్సి గోస్వామి, పిల్లలు ఇషాన్‌(7), ఇవాన్‌(4)లతో కలిసి బైస్తాపూర్‌లో ఒక డూప్లెక్స్‌లో నివసిస్తున్నారు. కాగా గురువారం ఇవాన్‌ గోస్వామి పుట్టిన రోజు కావడంతో అతని బర్త్‌డే పార్టీని ఘనంగా నిర్వహించాలనుకున్నారు.

శిల్పి గోస్వామి, తుషార్‌ తల్లి ఇంటి గ్రౌండ్‌ ప్లోర్‌లో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమవగా,  ఇవాన్‌,ఇషాన్‌లు ఇంటి మొదటి అంతస్తులో ఆడుకుంటున్నారు. ఇంతలో మొదటి అంతస్తు మంటల్లో చిక్కుకోవడంతో శిల్పి గోస్వామి పైకి వెళ్లి చూశారు. అప్పటికే ఇద్దరు మంటల్లో కాలిపోవడం చూసి ఆపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెకు కూడా మంటలంటుకున్నాయి. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇళ్లు మొత్తం మంటల్లో చిక్కుకోవడంతో స్థానికులు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారమందించారు. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పి వారందరిని గుహవాటి మెడికల్‌ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ఇవాన్‌, ఇషాన్‌లు చనిపోయారని వెల్లడించారు. కాగా శిల్సి గోస్వామి, తుషార్‌ తల్లికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదే విషయమై గుహవాటి పోలీస్‌ కమిషనర్‌ ఎంపి గుప్తా మాట్లాడుతూ.. ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ అవడంతో మొదటి అంతస్తు​ మంటల్లో చిక్కుకుందని తెలిపారు. కాగా తమ ప్రాథమిక విచారణలో షార్ట్‌ సర్క్యూట్‌తో గ్యాస్‌ సిలిండర్‌కు మంటలు అంటుకోవడంతో ఇళ్లు మొత్తం అంటుకుందని పేర్కొన్నారు. కాగా తుషార్‌కు ప్రమాదంపై సమాచారం ఇచ్చామని, అతను బయలుదేరినట్లు గుప్తా వెల్లడించారు. ఈ ఘటనపై అస్సాం సీఎం శరబనంద సోనోవాల్‌ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వెంటనే విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు