బాకూరు ఘాట్‌లో జీపు బోల్తా

3 Mar, 2018 11:39 IST|Sakshi
మృతిచెందిన బాలుడు లోయలో పడిన జీపు

నాలుగేళ్ల బాలుడి మృతి

మరో మహిళకు తీవ్ర గాయాలు

హుకుంపేట(అరకులోయ): మండలంలోని బాకూరు ఘాట్‌లోని డోగులజోరు సమీపంలోని మలుపు వద్ద ఓ జీపు అదుపుతప్పి లోయలోకి బోల్తా పడిన ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు.మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మరికొందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. సూకూరు పంచాయతీలోని బిరిసింగి గ్రామం నుంచి సుమారు 15 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం వెళ్తున్న సర్వీసు జీపునకు ఘాట్‌లోని డోగులజోరు సమీపంలో బ్రేక్‌ ఫెయిలైంది. దీంతో అదుపు తప్పి,లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాకూరు గ్రామానికి చెందిన గెమ్మెలి సంజయ్‌భార్గవ్‌(4),బాకూరు వెంకటలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి.

మరికొంత మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్న సంజయ్‌భార్గవ్‌ను పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మృతదేహాన్ని శవపరీక్షల గదిలో భద్రపరిచారు.తీవ్ర గాయాలపాలైన వెంకటలక్ష్మికి వైద్యసేవలు అందించారు. కుమారుడు తమ కళ్లముందే మృతిచెందడంతో తల్లిదండ్రులు కుమారి,సత్తిబాబు  కన్నీరుమున్నీరుగా విలపించారు.బరిసింగి గ్రామంలోని ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి, తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బిరిసింగి,బాకూరు గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. హుకుంపేట పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు అందడంతో ఎస్‌ఐ నాగకార్తీక్‌ కేసు నమోదు చేసి, సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు