విషాదం : బోరుబావి నుంచి తీసినా..!

15 Nov, 2017 12:20 IST|Sakshi

జైపూర్ : బోరు బావి ఓ చిన్నారిని బలితీసుకుంది. ఈ దుర్ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమన్ అనే ఐదేళ్ల బాలుడు సవాయి మధోపూర్ లోని మలర్నా దంగర్ అనే ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో చిన్నారి అమన్ తన స్నేహితులతో ఆడుకునేందుకు మంగళవారం బయటకు వెళ్లాడు.

ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ అమన్ 30 అడగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. ఇది గమనించిన తోటి చిన్నారులు.. అమన్ కోసం ఏడవటం మొదలుపెట్టారు. అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి విషయం అడగగా.. తమ స్నేహితుడు అమన్ బోరుబావిలో పడ్డాడని చెప్పారు. ఆ వ్యక్తి అధికారులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది చాలా శ్రమించి అమన్‌ను బోరుబావి నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ బాలుడు అమన్ బుధవారం ఉదయం చికిత్స పొందుతూ చనిపోయినట్లు సమాచారం. బాలుడి మృతితో సవాయి మధోపూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు