కనిగిరి : మిద్దెపైన కట్టిన పిట్ట గోడ కూలి బాలుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని కొత్తపేట వడ్డెర కాలనీలో గురువారం జరిగింది. స్థానికులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. వడ్డెర కాలనీలో నివసిస్తున్న రాజశేఖర్, అనుషా దంపతుల మూడేళ్ల కుమారుడు రోని షమ్షీల్ (చెర్రీ)ను తల్లి మిద్దెపైకి తీసుకెళ్లి గోరుముద్దలు తీనిపిస్తోంది. ఈ క్రమంలో చెర్రీ ఆడుకుంటూ పిట్ట గోడ వద్దకు వెళ్లాడు.
మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న పిట్టగోడపై బాలుడిని కూర్చుబెట్టి టిఫెన్ తినిపిస్తుండగా అటు ఇటు కదలడంతో పిట్టగోడ కూలింది. చెర్రీ పక్కన అనుకుని ఉన్న మరో మిద్దెపై పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఐదేళ్ల తర్వాత కలిగిన సంతానం కావడంతో కుమారుడిని ఎంతో అల్లారుముద్దుగా తల్లిదండ్రులు పెంచుకున్నారు. అప్పటి వరకూ కళ్లముందు ఆడుకుంటూ గోరుముద్దలు తిన్న తనయుడు క్షణాల వ్యవధిలో మృత్యువడికి చేరడంతో తల్లిదండ్రులు చేసే రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.