సాక్షి, జామి(విజయనగరం) : రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది.అంతవరకు తోటి స్నేహితులతో ఆడుకున్న చిన్నారి క్షణాల వ్యవధిలోనే విగతజీవిగా మారిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. మండలంలోని లక్ష్మీపురంలో ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... కొత్తవలస మండలం ఉత్తరావల్లి గ్రామానికి చెందిన చిటికిరెడ్డి లోహిత్(6) తాతగారి ఊరైన జామి మండలం లక్ష్మీపురం వచ్చాడు. గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వస్తున్న లోహిత్ను సమీప పొలాల నుంచి మట్టి తీసుకువస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లోహిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉత్తరావల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో లోహిత్ ఒకటో తరగతి చదువుతున్నాడు.వాస్తవానికి లోహిత్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం కొత్తవలస మండలంలోని ఉత్తరావల్లి వెళ్లిపోవాల్సి ఉంది. అయితే ప్రయాణాన్ని శనివారానికి వాయిదా వేసుకున్నారు. ఇంతలో ఈ ఘోరం జరిగిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హెచ్సీ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు