బాలుడి దుర్మరణం

28 Jun, 2019 12:09 IST|Sakshi

సాక్షి, గంగవరం(చిత్తూరు) : అతివేగంగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన గంగవరం మండలంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కల్లుపల్లికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు లితీష్‌ కుమార్‌(7) స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. గ్రామంలో జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల సమీపంలోనే బైపాస్‌ రోడ్డు వెళుతోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత లితీష్‌ కుమార్‌ ఇంటి వద్ద పుస్తకాలు పెట్టి తన చెల్లెలితో కలిసి ఆడుకునేందుకు రోడ్డు అవతలి వైపున ఉన్న చెట్ల కిందకు వెళుతున్నాడు.

పలమనేరు నుంచి మదనపల్లె వైపు వేగంగా వెళుతున్న గుర్తు తెలియని వాహనం బాలుడిని ఢీకొని వెళ్లిపోయింది. స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి కొన ఊపిరితో ఉన్న బాలుడిని వెంటనే పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న హైవే మొబైల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ పడి ఉన్న వాహనం నంబర్‌ ప్లేట్‌ కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా రోడ్డుపై ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి వాహనం కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.  

మరిన్ని వార్తలు