బావిలో పడి బాలుడి మృతి

10 May, 2018 14:09 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు

కమలాపూర్‌ (హుజూరాబాద్‌) వరంగల్‌ రూరల్‌ : ఆటలాడుకుంటూ  ప్రమాదవశాత్తు చేద బావిలో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కమలాపూర్‌ మండలంలోని ఉప్పల్‌లో బుధవారం జరిగింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఉప్పల్‌లో నాయీబ్రాహ్మణ వృత్తితో పాటు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న విష్ణుభక్తుల రమేష్‌–వాణి దంపతులకు ఒక కూతురు, కుమారుడు రితిక్‌ (3) ఉన్నారు.

బుధవారం ఉదయమే పనుల నిమిత్తం రమేష్‌ బయటకు వెళ్లగా, వాణి ఉపాధి పనులకు వెళ్లింది. సుమారు 8 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన రమేష్‌కు ఇంటి వద్ద రితిక్‌ కనిపించకపోవడంతో ఎక్కడకు వెళ్లాడా అని వెతికాడు. ఇలా మూడు గంటల పాటు వెతికినా బాలుడి ఆచూకీ దొరకలేదు. చివరకు తమ ఇంటి ఆవరణలోని చేద బావిపై వేసిన రేకు పక్కకు పడి ఉండడంతో అనుమానం వచ్చి బావిలో పాతాళ గరిగె వేసి చూడగా బాలుడు కొక్కానికి చిక్కాడు.

స్థానికుల సాయంతో బాలుడి బావిలోంచి బయటకు తీయగా అప్పటికే రితిక్‌ చనిపోయినట్లు తెలిపారు. రితిక్‌ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. 

మరిన్ని వార్తలు