జ్యూస్‌ అనుకుని విషం తాగాడు..!

4 Nov, 2017 19:05 IST|Sakshi

సాక్షి, పళ్లిపట్టు : కుటుంబ సభ్యుల కోసం టీ తయారు చేస్తున్న ఓ బాలిక తెలిసి తెలియక అందులో పురుగుల మందు కలపడంతో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. బిహార్‌లో జరిగిన ఈ సంఘటన మరువక ముందే తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జ్యూస్‌ అనుకుని ఓ బాలుడు పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. 

వివరాలివి.. పళ్లిపట్టు మండలం కొళత్తూరు గ్రామ పంచాయతిలోని జయంతి కాలనీలో కార్మికుడు బాబు, లావణ్యలు నివశిస్తున్నారు. ఈ దంపతులకు భాను(7), కదిర్‌వేల్‌ అలియాస్‌ అఖిల్‌(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అఖిల్‌ శుక్రవారం ఇంటి సమీపంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో సమీపంలోని చెత్త కుప్పలో ఉన్న బాటిళ్లను చూశాడు. 

అందులో జ్యూస్‌ ఉంటుందని అనుకుని ఆ పురుగుల మందును తాగాడు. కాసేపటి తరువాత ఆ బాలుడు స్పృహ కోల్పోయాడు.  విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే పళ్లిపట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు