వివాహేతర సంబంధం బయటపడుతుందని..

6 Jul, 2018 21:10 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితుడు సుభాష్‌ కుమార్‌

లక్నో : వివాహేతర సంబంధం బయటపడుతందున్న భయంతో 14ఏళ్ల బాలుడి గొంతు కోసి చంపాడో వ్యక్తి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మురద్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాబాద్‌కు చెందిన సుభాష్‌ కుమార్‌.. మోదీ నగర్‌లోని ఓ ఇంట్లో తొమ్మిది నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. అతడికి పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కుమార్‌ ఎల్‌పీజీ ఏజెన్సీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతడు గత కొద్ది నెలలుగా ఇంటి యాజమాని భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ కలిసున్న సమయంలో ఆమె కుమారుడు చూసాడని అనుమానించారు. బాలుడు విషయం బయటకు చెబితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన కుమార్‌ హత్యకు పన్నాగం పన్నాడు.

బాలుడికి గాలిపటాలు కొనిపిస్తానని చెప్పి తీసుకెళ్లి ఓ చెక్కెర ఫ్యాక్టరీ దగ్గర గొంతు కోసి హత్య చేశాడు. బాలుడు కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం బాలుడికి  తోటి పిల్లలతో క్రికెట్‌కు సంబంధించిన విషయంలో చిన్న గొడవ అయ్యింది. దీన్ని హత్యకు కారణంగా బాలుడి తల్లిదండ్రులు అనుమానించారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. సీసీటీవీ ఫోటేజ్‌లను గమనించిన పోలీసులకు మృతుడు.. కుమార్‌తో స్కూటీపై ప్రయాణించిన దృశ్యాలు కనిపించాయి. వీటి ఆధారంగా అతన్ని విచారించగా అసలు విషయం బయటపడింది. వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతోనే బాలున్ని హత్య చేసినట్లు కుమార్‌ అంగీకరించాడు. అతనిపై కిడ్నాప్‌, హత్య కేసు నమోదు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు