దూరమవుతుందనే ఆమెను హత్య చేశా

11 Jun, 2019 08:29 IST|Sakshi

రహస్య వివాహం విషాదాంతం నిందితుడు అరెస్ట్‌ 

యశవంతపుర: రహస్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు పెద్దల సమక్షంలో మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో తరికెరెకి చెందిన అంజనా వశిష్ట (22)ను హత్య చేసినట్లు నిందితుడు సందీప్‌ రాథోడ్‌ పోలీసుల ఎదుట అంగీకరించాడు. నిందితుడిని పోలీసులు శుక్రవారం ఘటన స్థలానికి తీసుకెళ్లి విచారణ చేశారు. వివరాలు... విజయపుర జిల్లా సింధగికి చెందిన సందీప్‌రాథోడ్‌ అత్తావరలో అద్దె ఇంటిలో ఉంటున్నాడు. గత ఏడాది ఫేస్‌బుక్‌ ద్వారా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. మంగళూరులో బ్యాంక్‌ కోచింగ్‌కు వచ్చిన అంజనా వద్దకు పలుమార్లు సందీప్‌ వెళ్లాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో కద్రి ఆలయంలో అంజనాను వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇద్దరు కలిసి మంగళూరులో లాడ్జిలో ఉండేవారు.

ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఉద్యోగ విషయంగా ఘర్షణ జరిగింది. దీంతో యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. అంజనాకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మంగళూరులో తను ఉంటున్న ఇంటికి పిలిపించాడు. శుక్రవారం సందీప్‌ ఇంటికి వచ్చిన అంజనా ఇద్దరు మరోసారి ఘర్షణ పడ్డారు. అంజనా తనకు దూరమవుతుందని భావించి వైర్‌తో ఆమె గొంతుకు బిగించి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు. శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో అంజనా అకౌంట్‌ నుండి రూ.15 వేలు డ్రా చేసుకున్నాడు. అనంతరం శిరిసికి వెళ్లాడు. అక్కడ నుండి హుబ్లీ మార్గంలో విజయపుర, అక్కడ నుండి సిందగికి వెళ్లి అక్కడ ఒక లాడ్జీలో ఉండగా మంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.   
 

మరిన్ని వార్తలు