ప్రేమ పేరుతో అమానుషం

12 Sep, 2019 07:46 IST|Sakshi

కలబుర్గిలో మానవ మృగం అరెస్టు  

కర్ణాటక  ,రాయచూరు రూరల్‌: యువకుని చేతిలో యువతి హత్యకు గురైన సంఘటన కలబుర్గిలో చోటు చేసుకుంది. రాజాపుర నివాసి రాజా పూజారి (25) అనే యువకుడు కాలేజీ విద్యార్థినులతో ప్రేమపేరుతో మభ్యపెట్టి షికార్లకు తీసుకెళ్లేవాడు. ఇతని తండ్రి పోలీస్‌ కానిస్టేబుల్‌ కాగా, ఇతడు జులాయిగా తిరిగేవాడు. అలాగే ఒక యువతిని ప్రేమపేరుతో మోసగించాడు. ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్‌ మందులిప్పించి మరణానికి కారణమయ్యాడు.  

అబార్షన్‌తో విద్యార్థిని మృతి  
యువతి శీబారాణి కలబుర్గిలో ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 4న కళాశాలకు వెళ్లిన శీబారాణి సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు రెండు రోజుల పాటు వెదికారు. ఈ నెల 6న కలబుర్గిలోని బ్రహ్మగిరి పోలీస్‌ స్టేషన్‌లో శిబారాణి కనబడటం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. యువతి కిడ్నాప్‌నకు ప్రధాన సూత్రధారి రాజా పూజారి అని గుర్తించిన పోలీసులు అతనిని అరెస్ట్‌ చేసి విచారించగా గుట్టు బయటపెట్టాడు. శీబారాణిని హత్య చేసి కాల్చివేసి శవాన్ని తెలంగాణలోని జహీరాబాద్‌లో పడేసినట్లు చెప్పాడు. గర్భం ధరించిన శీబారాణికి అబార్షన్‌ చేయించడానికి అధిక డోస్‌లో ఇంజక్షన్లు ఇప్పించాడు. యువతికి అబార్షన్‌ కావడంతో శక్తిమంతమైన మందులు వికటించి మృతి చెందడంతో 48 గంటల పాటు ఆమె, గర్భస్థ పిండం శవాల్ని కారులోనే తిప్పి శవం కుళ్లిపోవడంతో జహీరాబాద్‌ రహదారి పక్కనే గుంత తవ్వి పెట్రోల్‌ పోసి అంటించాడని పోలీసులు తెలిపారు. ఇలాంటి మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. 

మరిన్ని వార్తలు