టిక్‌..'ఎ'టాక్‌

18 Jun, 2020 07:44 IST|Sakshi

శ్రీరంగపట్టణం లాడ్జ్‌లో మహిళ దారుణ హత్య

ప్రియుడే హంతకుడు  

వేరే యువకునితో వీడియోలపై అక్కసు

మండ్య: టిక్‌టాక్‌ వీడియోలు ప్రాణాలు తీస్తున్నాయి. మరో యువకునితో టిక్‌టాక్‌ వీడియోలు తీస్తోందని మహిళపై ఆగ్రహం పెంచుకున్న ప్రియుడు ఆమెను అంతమొందించాడు. మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణంలో ఉన్న మైరూమ్‌ గెస్ట్‌హౌస్‌లో మహిళను కత్తితో పొడిచి హత్య చేశాడు. హతురాలిని మైసూరు కనకనగరకు చెందిన జ్యోతి (35)గా, నిందితున్ని మైసూరు ఇలవాల ప్రాంతానికి చెందిన అనిల్‌గా పోలీసులు గుర్తించారు. బుధవారం అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం వీరిద్దరూ దగ్గరి బంధువులు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది. మంగళవారం మండ్యలోని శ్రీరంగపట్టణంకు వచ్చిన ఈ జంట అక్కడి మైరూమ్‌ గెస్ట్‌హౌస్‌లో భార్యభర్తలం అని చెప్పి రూం తీసుకున్నారు.   (ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య )

17 సార్లు కత్తితో పొడిచి  
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మద్యపానం చేశారు. ఇంతలో జ్యోతిని అతడు కత్తితో17 సార్లు పొడిచి చంపి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. సాయంత్రం ఆరు గంటలైనా అలికిడి లేకపోవడంతో పనివాళ్లు గది తలుపులు కొట్టగా తీయలేదు. వారు అనిల్‌కు ఫోన్‌ చేసినా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. వెంటనే డూప్లికేట్‌ కీతో గది తలుపు తీసి చూడగా గదిలో రక్తం మడుగులో వివస్త్రగా మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు.  

ఒప్పుకున్న నిందితుడు  
బుధవారం అనిల్‌ను మైసూరులో పట్టుకుని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు. తమ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని, జ్యోతి ఇటీవల ఒక యువకునితో కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేయడం చూసి ఓర్వలేకపోయినట్లు చెప్పాడు. దీంతో ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

మరిన్ని వార్తలు