ఫొటోలు అడ్డు పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌

19 Apr, 2019 07:10 IST|Sakshi

బంజారాహిల్స్‌: ప్రేమించిన సమయంలో తనతో తీసుకున్న ఫొటోలను అడ్డు పెట్టుకొని తనను పెళ్లి చేసుకోకపోతే వాటిని సోషల్‌ మీడియాలో పోస్టుచేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇందిరానగర్‌కు చెందిన యువతి(17) జూబ్లీహిల్స్‌లోని ఓ పత్రికా కార్యాలయంలో హౌజ్‌కీపింగ్‌గా పని చేసేది. అక్కడే పని చేస్తున్న శివ అనే అటెండర్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ సమయంలో ఇద్దరూ కలిసి ఫొటోలు  దిగారు.

అయితే గత కొద్దిరోజులుగా అతని వేధింపులు తట్టుకోలేక ఆమె శివను దూరం పెట్టింది. ఇటీవల ఆమెకు పెళ్లి కుదిరింది. దీనిని జీర్ణించుకోలేని శివగత నెల రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. తల్లి తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తూ తనకు ఇచ్చి పెళ్లి చేయకపోతే అందరినీ చంపే స్తానని బెదిరిస్తున్నాడు. ఫొటోలు బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు.శివ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోపేర్కొంది. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు