బాలికను కొండపై నుంచి తోసేసి..

19 Dec, 2019 08:28 IST|Sakshi
మృతి చెందిన నివేద (ఫైల్‌) మృతదేహం వద్ద విచారణ చేస్తున్న పోలీసులు

మైనర్‌ బాలికపై ప్రియుడి ఆఘాయిత్యం

యువకుడి కోసం గాలింపు

తమిళనాడు, వేలూరు: ఏకాంతంగా మాట్లాడాలని బాలికను కొండపైకి తీసుకెళ్లిన ప్రియుడు ఆమెను అక్కడి నుంచి తోసేసి హత్య చేసిన ఘటన వేలూరులో జరిగింది. వివరాలు.. వేలూరు సమీపంలోని తీర్థగిరి కొండపైన రాళ్ల క్యారీలో బాలిక మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వేలూరు సమీపంలోని ఏ పోలీస్‌స్టేషన్‌లోనైనా బాలిక మాయమైనట్లు ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా అని సత్‌వచ్చారి పోలీసులు విచారణ చేపట్టారు. నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌లో అరియూర్‌కుప్పంకు చెందిన 17 ఏళ్ల బాలిక అదృశ్యంపై కేసు నమోదు అయినట్లు తెలిసింది.

పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మాయమైన బాలికగా గుర్తించారు. ఈమె అరియూర్‌ కుప్పంకు చెందిన చెప్పుల వ్యాపారి శరవణన్‌ కుమార్తె నివేద(17)గా తెలిసింది. ఈమె ఇటీవల ఫ్లస్‌టూ పూర్తి చేసి వేలూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో క్యాంటిన్‌లో పనిచేస్తుండేది. ఈ నెల 14న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అనంతరం ఇంటికి రాలేదు. ఆమె సెల్‌ఫోన్‌కు వచ్చిన అన్ని కాల్స్‌ను పోలీసులు నమోదు చేశారు.

పోలీసుల కథనం మేరకు.. మృతి చెందిన బాలిక.. కొనవట్టంకు చెందిన ఓ యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ సెల్‌ఫోన్‌లో తరచూ మాట్లాడుకునే వారు. క్యాంటిన్‌లో పనికి చేరిన మొదటి రోజే వేరే ఒకరితో ఆమెకు పరిచయం ఏర్పడింది. మరుసటి రోజునే ఇద్దరిలో ఒకరు తనను వివాహం చేసుకోవాలని వేధింపులకు గురి చేసినట్లు.. ఒంటరిగా మాట్లాడాలని చెప్పి బాలికను తీర్థగిరి కొండకు తీసుకెళ్లాడు. మాటమాట పెరగడంతో ఆగ్రహించిన ప్రియుడు బాలికను కొండపై నుంచి కిందికి తోసి ఉండవచ్చని తెలిపారు. నివేద మాయమైన రోజున ఆమె సెల్‌నంబర్‌ సత్‌వచ్చారి ప్రాంతంలో స్వీచ్‌ఆఫ్‌ అయినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు