ఐటీ జోన్‌లో ఆకతాయిల వీరంగం

2 May, 2018 09:33 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సోమవారం అర్ధరాత్రి ఐటీ జోన్‌లో బైక్‌పై ‘స్వైర విహారం’ చేసిన ఇద్దరు యువకులు వరుస దాడులకు పాల్పడ్డారు. ఓ హోటల్‌ సిబ్బందిపై చేయి చేసుకోవడంతో పాటు ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. మరో రెండు ప్రాంతాల్లో నలుగురిపై దాడి చేసి గాయపరిచారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మాదాపూర్‌ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..సోమవారం రాత్రి దుర్గం చెరువు సమీపంలోని ‘సంప్రదాయ రుచులు’ రెస్టారెంట్‌ను మూసివేసిన అనంతరం సిబ్బంది రెస్టారెంట్‌ను శుభ్రం చేసే పనిలో ఉన్నారు. 11.40 గంటల ప్రాంతంలో మాదాపూర్‌ ఠాణా వైపు నుంచి పల్సర్‌ బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు రెస్టారెంట్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. లోపలకు దూసుకువచ్చిన వారు ఫర్నిచర్, కంప్యూటర్‌ మానిటర్‌ను ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడి చేశారు.

రెస్టారెంట్‌ బయట ఉన్న ఓ వాహనాన్ని కిందకు తోశారు. దీనిపై సమాచారం అందడంతో రెస్టారెంట్‌ యజమాని ఈశ్వర్‌ మాదాపూర్‌ ఠాణాకు వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన గస్తీ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని  వివరాలు తెలుసుకున్నాయి. ఈ లోగా ముందుకు వెళ్లిన ఆ ఇద్దరూ ఇనార్బిట్‌ మాల్‌ సమీపంలో భార్యభర్తలపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం మరో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల పై దాడి చేశారు. ఈ నలుగురు బాధితుల గస్తీ బృందాలకు సమాచారం ఇచ్చినా లిఖిత పూర్వక ఫిర్యాదు చేయలేదు. ఈశ్వర్‌ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మాదాపూర్‌ పోలీసులు రెస్టారెంట్, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. వాహనం నెంబర్‌ గుర్తించి వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఆ ఇద్దరూ మద్యం మత్తులోనో, డ్రగ్స్‌ ప్రభావంతోనో అలా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  

మరిన్ని వార్తలు