భర్తపై దాడిచేసిన నవ వధువు అరెస్టు

30 May, 2018 12:43 IST|Sakshi
పోలీసు స్టేషన్‌ వద్ద నీలిమ

రిమాండ్‌కు తరలింపు

సంతబొమ్మాళి/కాశీబుగ్గ : మనసులో ఒకరు... మనువు మరొకరితో జరగడం వల్లే భర్త నవీన్‌కుమార్‌పై దాడికి ప్రేరేపించిందని భార్య నీలిమ పోలీసుల సమక్షంలో ఒప్పుకుంది. స్థానిక ఎస్‌ఐ రామారావు మంగళవారం చెప్పిన వివరాలు ప్రకారం... మూలనర్సాపురం గ్రామానికి చెందిన బుడ్డ నవీన్‌కుమార్‌పై భార్య నీలిమ చాకుతో సోమవారం దాడి చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.

నవీన్‌కుమార్‌ అత్తవారి గ్రామమైన గొలదాం నుంచి సోమవారం సాయంత్రం బైక్‌పై వస్తున్న సమయంలో మూలనర్సాపురం గ్రామ సమీపంలోని తోటల వద్దకు వచ్చేసరికి నీలిమ ఈ అఘాయిత్యానికి పాల్పడిన విషయం విదితమే.

అయితే వేరొకరితో ప్రేమ వ్యవహారం నడుస్తుండడంతో ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయడంతో నీలిమ ఈ దారుణానికి పూనుకుందన్నారు. ప్లాన్‌ ప్రకారం వెంట తెచ్చుకున్న చాకుతో మూలనర్సాపురం సమీప తోటల్లో దాడి చేసిందన్నారు.

నేరం ఒప్పుకున్నందున కేసు నమోదు చేసి, ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని ఎస్‌ఐ తెలిపారు. ఇదే విషయాన్ని కాశీబుగ్గ డీఎస్పీ ఎస్‌.రాఘవ కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో విలేకరుల సమావేశంలో తెలిపారు. నీలిమను అరెస్టు చేసి శ్రీకాకుళం కోర్టులో మంగళవారం హాజరుపరిచామన్నారు. 307 సెక్షన్‌ కింద ఈమెపై కేసు నమోదు చేశామన్నారు.

మరిన్ని వార్తలు