నవ వధువు ఆత్మహత్య

8 Nov, 2019 09:38 IST|Sakshi
శివశక్తి (ఫైల్‌)

అన్నానగర్‌: కంబమ్‌లో బుధవారం వివాహం జరిగిన ఐదు రోజుల్లో నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తేని జిల్లా కంబమ్‌ స్వామి వివేకానందర్‌ వీధికి చెందిన రాజా కుమారుడు సేదుపతి (22). ఇతను హాస్టల్‌ యజమాని. కంబమ్‌ కురంజమాయన్‌ వీధికి చెందిన మణికంఠన్‌ కుమార్తె శివశక్తి (18). బంధువులైన సేదుపతికి, శివశక్తికి ఈనెల 1వ తేదీ పెళ్లి జరిగింది. వివాహం జరిగిన తరువాత సేదుపతి తన మిద్దెలో భార్యతో నివసిస్తూ వస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో నుంచి సేదుపతి బయటకి వెళ్లాడు.

శివశక్తి మాత్రం ఒంటరిగా ఉంది. చాలాసేపు అయినా మిద్దెపై నుంచి ఆమె కిందకి రాకపోవడంతో అత్త పుష్పవళ్లి పైకెళ్లి చూసింది. అక్కడ ఫ్యాన్‌కి ఉరివేసుకుని శివశక్తి శవంగా వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న కంబమ్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని శివశక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంబమ్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో శివశక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. కానీ ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియరాలేదు.

మరిన్ని వార్తలు