పారాణింకా ఆరకముందే..

3 Jan, 2019 12:56 IST|Sakshi
మృతిచెందిన నవ వధువు అంజుమ్‌ కౌర్‌(22) భార్య మృతితో విషణ్ణవదనంలో ఎజాజ్‌

కారు ఢీకొని నవవధువు మృతి

కౌతాళం ఎంపీడీఓపై కేసు నమోదు

కర్నూలు, వెల్దుర్తి:  పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతిచెందింది. ఈ ఘటన వెల్దుర్తి మండలం పెండేకల్‌ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బేతంచెర్లకు చెందిన అంజుమ్‌ కౌర్‌(22), కర్నూలుఅజముద్దీన్‌ నగర్‌కు చెందిన ఎజాజ్‌కు డిసెంబర్‌ 30న నిఖా(పెళ్లి) వధువు స్వగృహంలో జరిగింది. కర్నూలులో వలిమా(మరలు పెళ్లి) అనంతరంవధూవరులుబేతంచెర్లకు చేరుకున్నారు. మంగళవారం వెల్దుర్తిలో ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఫంక్షన్‌ ముగిసిన తర్వాత రాత్రి నూతన వధూవరులు ఒక బైక్‌పై, బంధువులు  ఇతర బైక్‌లపై బేతంచెర్లకు తిరుగు ప్రయాణమయ్యారు.

సర్పరాజాపురం మిట్ట అవతల పెండేకల్‌ సమీపాన మలుపుల వద్ద ఎదురుగా వచ్చిన కౌతాళం ఎంపీడీఓ మురళీమోహన మూర్తి కారు వధూవరుల బైక్‌ను ఢీకొంది. ఆయన సొంతూరైన వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు నుంచి కౌతాళంలో విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ఢీకొనడంతో బైక్‌పై నుంచి ఎగిరి కిందపడిన నవవధువు అంజుమ్‌ తలకు బలమైన గాయాలయ్యాయి. వెంట బైక్‌లపై వచ్చిన బంధువులు గమనించి వెంటనే ఆమెను కర్నూలు తీసుకెళ్లారు. మొదట ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి.. అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోలుకోలేక అర్ధరాత్రి మృతిచెందింది. భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతురాలి తల్లిదండ్రులు ఇస్మాయిల్, మున్ని, ఇరువురు చెల్లెళ్లు, తమ్ముడు,  బంధువుల రోదనలుమిన్నంటాయి. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని  బేతంచెర్లకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంపీడీఓ మురళీ మోహన మూర్తిపై కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పులిశేఖర్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు