ప్రేమికుడితో వధువు పరారీ

10 Jun, 2019 07:07 IST|Sakshi
బోసిపోయిన పెళ్లి ప్రాంగణం

తుమకూరు : తెల్లారితే పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువు సినిమాను తలపించే విధంగా నాటకమాడి ప్రేమించినవాడితో పారిపోయిన ఘటన ఆదివారం శిర తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన యువతికి దొడ్డగుళ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిర్ణయించారు. ఆదివారం ఉదయం వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి ఇష్టం లేని వధువు ప్రేమించిన అత్త కొడుకు చేతన్‌తో పారిపోవడానికి పథకం వేసింది. అందులో భాగంగా శనివారం రాత్రి శరీరంపై విషం చల్లుకొని విషం తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు నాటకమాడింది.

ఇది గమనించిన తల్లితండ్రులు వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం చేతన్‌ ఆసుపత్రికి చేరుకోవడంతో ఆసుపత్రి ఉన్న తల్లితండ్రులు, బంధువుల కళ్లుగప్పి చేతన్‌తో పారిపోయింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న ఇద్దరు ప్రేమ విషయం ఇంట్లో చెప్పకపోవడంతో ఇరువురి ప్రేమ విషయం తెలియని యువతి తల్లితండ్రులు వివాహం నిర్ణయించారు. దీంతో పెళ్లి ఇష్టం లేని యువతి పథకం ప్రకారం అత్త కొడుకు చేతన్‌ను వివాహానికి రప్పించి అటుపై నాటకం ప్రకారం ఆసుపత్రిలో చేరి అక్కడి నుంచి చేతన్‌తో పారిపోయింది. తావరకెరె పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు