నవ వధువు అదృశ్యం

31 May, 2019 06:45 IST|Sakshi
దివ్య (ఫైల్‌)

మేడ్చల్‌రూరల్‌: పెళ్లయిన వారం రోజులకే ఓ యువతి అదృశ్యమైన ఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మండలం కండ్లకోయ గ్రామానికి చెందిన యాదమ్మ, నర్సింహ్మ దంపతుల కూతురు దివ్య (21)కు ఈ నెల 22న మెదక్‌ జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన  మహేశ్‌తో వివాహం జరిగింది. పెళ్లి కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ నెల 27న దివ్య తన భర్త మహేశ్‌తో కలిసి కండ్లకోయలోని పుట్టింటికి వచ్చింది.

ఆ సమయంలో ఆమె తల్లి యాదమ్మ డ్యూటీకి వెళ్లిపోయింది. దివ్య తన భర్త మహేశ్, తండ్రి నర్సింహలకు భోజనం వడ్డించి తానూ భుజించింది. సాయంత్రం తల్లి యాదమ్మ విధులు ముగించుకుని ఇంటికి చేరుకుంది. 28న ఉదయం యాదమ్మ డ్యూటీకి వెళ్లిపోయింది. తనకు ఆదాయ సర్టిఫికెట్‌ తీసుకురావాలని తండ్రి నర్సింహను దివ్య బయటికి పంపించింది. ఇంట్లో ఉన్న భర్త మహేశ్‌ నిద్రిస్తుండడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. విషయం గమనించిన కుటుంబికులు దివ్య ఆచూకీ కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో గురువారం మేడ్చల్‌ పోలీసులను ఆశ్రయించారు. దివ్య తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు